
‘సినిమా చూసి థియేటర్ బైటికొచ్చాక కూడా వెంటాడే చిత్రాలు చాలా తక్కువ వస్తాయి. నేటికాలంలో అలాంటివి మరీ అరుదైపోయాయి. మా సినిమా ఆ లోటు తీర్చే తరహాలోనిది. సినిమా చూసి బైటికొచ్చాక కూడా..స్వచ్ఛమైన ప్రేమ అంటే ఇదే.. అన్న భావన వెన్నాడుతుంది. దేవదాసు, లైలా మజ్ను..ఈ కోవలోని చిత్రమిది’ అన్నారు లక్ష్మీ గణపతి ఫిలింస్ అధినేత బి.సుబ్రహ్మణ్యం. విదార్థ్-అమలా పౌల్ జంటగా నటించి..తమిళంలో విజయం సాధించిన ‘మైనా’ చిత్రాన్ని..తెలుగులో ‘ప్రేమ ఖైదీ’ పేరుతో అందిస్తున్నారాయన. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మరిన్ని విశేషాలు ముచ్చటిస్తూ..‘‘తమిళనాడు-కేరళ సరిహద్దుల్లో జరిగిన ఓ యధార్థ ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది.
జర్నీ ఆఫ్ లవ్..అనేది ఉపశీర్షికగా నిర్ణయించాం. అనువాదం రాజీ లేకుండా చేస్తున్నాం. వెన్నెలకంటి రాసిన పాటలు సాహిత్య విలువలతో మైమరిపిస్తాయి. ఖైదీలైన ప్రేమికులు పోలీసుల సమక్షంలోనే తమ ప్రేమను ఆస్వాధించిన తీరు ఈ సినిమాలో చాలా ప్రత్యేకం. ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన మా బేనర్లో వస్తున్న అరుదైన ప్రేమకథా చిత్రమిది. జూలై రెండోవారంలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. తంబిరామయ్య, వేతు ధరణి, పూరిత, వినోద్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమాన్, మాటలు-పాటలు: వెన్నెలకంటి, నిర్మాతలు: సుబ్రహ్మణ్యం.బి, రూపేష్. వై, కథ-కథనం-దర్శకత్వం: ప్రభుసాల్మన్.
No comments:
Post a Comment